టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు.
గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.
గిల్ అజేయ అర్ధ శతకం
మిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
లక్నో వేదికగా..
ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.
యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రం
అఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
గత మ్యాచ్లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.


