World Cup 2022: అర్ధ శతకాలతో అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్‌.. ఆఖర్లో పూజా మెరుపులు

ICC Women World Cup 2022 IND W Vs AUS W: India Score 277 Loss Of 7 Wickets - Sakshi

ICC Women World Cup 2022 IND W Vs AUS W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. కాగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది.

ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. గత రెండు మ్యాచ్‌లలో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడిన ఓపెనర్‌ స్మృతి మంధాన 10 పరుగులకే పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ 12 పరుగులు సాధించి అవుట్‌ అయింది. 

ఇక వనౌడౌన్‌లో వచ్చిన యస్తికా భాటియా (59), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(68) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఓపెనర్లు ఇద్దరినీ అవుట్‌ చేసిన ఆసీస్‌ బౌలర్‌ డార్సీ బ్రౌన్‌ మంచి ఫామ్‌లోకి వచ్చిన యస్తికాను అవుట్‌ చేసింది. ఆ తర్వాత మిథాలీ అలనా కింగ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగింది.

ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన పూజా వస్త్రాకర్‌ రనౌట్‌ కావడంతో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది.ఇక ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌కు మూడు, జెస్‌ జొనాసెన్‌కు ఒకటి, అలనా కింగ్‌కు 2 వికెట్లు దక్కాయి.

భారత్‌ స్కోరు: 277-7 (50 Ov)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top