ఓవర్లు కాదు...ఇకపై బంతుల లెక్క! | ICC new rule on T20 Powerplay | Sakshi
Sakshi News home page

ఓవర్లు కాదు...ఇకపై బంతుల లెక్క!

Jun 28 2025 3:31 AM | Updated on Jun 28 2025 3:31 AM

ICC new rule on T20 Powerplay

టి20 పవర్‌ప్లేపై ఐసీసీ కొత్త నిబంధన

దుబాయ్‌: వర్షం కారణంగా టి20 మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చినప్పుడు ఎన్ని ఓవర్లు పవర్‌ప్లే ఉండాలనే విషయంపై ప్రతీసారి గందరగోళం ఎదురవుతోంది. ఒక టి20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే 6 ఓవర్లు కాగా... ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య తగ్గగానే దాని ప్రకారం లెక్కగట్టి పవర్‌ప్లే ఓవర్ల సంఖ్యను నిర్ణయించేవారు. అయితే ఒక్కో బంతి ఎంతో కీలకంగా మారి మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసే టి20ల్లో ఇది సరైంది కాదని చర్చ జరిగింది. దాంతో టి20 పవర్‌ప్లే విషయంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మార్పు చేసింది. 

ఇది జూలై నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఇకపై కచ్చితత్వం కోసం ఓవర్లు కాకుండా బంతులను పవర్‌ప్లే కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 5 ఓవర్ల మ్యాచ్‌ అయితే 1.3 ఓవర్ల పవర్‌ప్లేనే ఉండాలి. కానీ దానిని దగ్గరి ఓవర్‌కు సవరించి ఇప్పటి వరకు పవర్‌ప్లే 2 ఓవర్లుగా ఇస్తున్నారు. కానీ ఇకపై ఇది మారనుంది. మున్ముందు 5 ఓవర్లో మ్యాచ్‌ అయితే సరిగ్గా 1.3 ఓవర్లే పవర్‌ప్లే ఉంటుంది. 

ఇదే తరహాలో 6 ఓవర్లు (1.5), 7 ఓవర్లు (2.1), 9 ఓవర్లు (2.4)...ఇలా 19 ఓవర్ల (5.4) వరకు ఎన్ని బంతులు అనే విషయంపై ఐసీసీ పూర్తి స్పష్టతనిచ్చింది. ఓవర్‌ మధ్యలో పవర్‌ప్లే ముగియడం వల్ల ఎవరికీ సమస్య ఎదురు కాదని ఐసీసీ అభిప్రాయపడింది. పవర్‌ప్లే ముగియగానే అంపైర్లు సిగ్నల్‌ ఇస్తారని...దాని ప్రకారం ఫీల్డర్లను పెట్టుకోవచ్చని పేర్కొంది. 

వైడ్‌ నిబంధనలోనూ మార్పు... 
వన్డేలు, టి20ల్లో ‘వైడ్‌’ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. లెగ్‌సైడ్‌ బంతి వెళితే చాలు దానిని అంపైర్లు ‘వైడ్‌’గా ప్రకటిస్తున్నారు. షాట్‌ ఆడే క్రమంలో బ్యాటర్‌ పక్కకు జరిగినా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇకపై బౌలర్లకు కాస్త సడలింపు ఉండేలా కొత్త నిబంధనను తీసుకొచ్చారు. దీని ప్రకారం ‘బంతిని విడుదల చేసే సమయంలో బ్యాటర్‌ కాలు ఎక్కడ ఉందని విషయాన్ని కూడా వైడ్‌ను ప్రకటించే విషయంలో పరిగణనలోకి తీసుకుంటాం. 

బంతి బౌలర్‌ చేతిని వీడాక షాట్‌ ఆడేందుకు బ్యాటర్‌ ఆఫ్‌సైడ్‌కు జరిగినా సరే దీనిని అంపైర్లు దీనిని దృష్టిలో పెట్టుకుంటారు’ అని ఐసీసీ వెల్లడించింది. ఇది బౌలర్లకు కాస్త ఊరటనిస్తుందని, అందుకే దీని కోసం సిఫారసు చేసినట్లు ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడు, మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ చెప్పారు.

కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ పేరు చెప్పాలి...
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విషయంలో ఐసీసీ కొత్త మార్పు తెచ్చింది. ఇకపై ప్రతీ మాయ్‌చ్‌కు ముందు ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’ పేరును కూడా జట్లు వెల్లడించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు తమకు అవసరమైన ఆటగాడిని పంపకుండా ఈ నిబంధనతో అడ్డుకోవచ్చు. కన్‌కషన్‌తో బయటకు వెళ్లిన ఆటగాడు కనీసం వారం రోజుల విరామం తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగాలి. 

ఆటగాళ్లకు తగిన విశ్రాంతి, వారి సౌకర్యం కోసం అని ఐసీసీ పేర్కొంది. అయితే కన్‌కషన్‌ పేరుతో ఒక మ్యాచ్‌ నుంచి హఠాత్తుగా తప్పుకొని వెంటనే తర్వాతి మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యే ఆటగాళ్లను నిలువరించడం కూడా కొత్త నిబంధనకు ఒక కారణం. మరోవైపు మ్యాచ్‌ మొదలైన తర్వాత ఏ ఆటగాడికైనా తీవ్ర గాయం అయితే ఆ జట్టు పది మందితోనే మ్యాచ్‌లో కొనసాగేది. 

ఇకపై అలా జరిగితే అదే తరహా మరో ఆటగాడిని పూర్తి స్థాయిలో తుది జట్టులోకి తీసుకొని ఆడించవచ్చు. అయితే ఈ నిబంధనను ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కాకుండా దేశవాళీ క్రికెట్‌లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement