‘హైబ్రిడ్‌’ మోడల్‌పైనే చర్చ! | ICC key meeting today | Sakshi
Sakshi News home page

‘హైబ్రిడ్‌’ మోడల్‌పైనే చర్చ!

Nov 29 2024 4:17 AM | Updated on Nov 29 2024 4:17 AM

ICC key meeting today

నేడు ఐసీసీ కీలక సమావేశం 

చాంపియన్స్‌ ట్రోఫీపై నిర్ణయం తీసుకునే అవకాశం  

దుబాయ్‌: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్‌ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్‌ జట్టు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. 

ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్‌ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్‌ మోడల్‌. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే నిర్వహించి భారత్‌ ఆడే మ్యాచ్‌ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్‌ నాకౌట్‌ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. 

గత ఏడాది ఆసియా కప్‌ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్‌ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్‌ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్‌ కప్‌ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. 

టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్‌ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్‌ దశలో భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్‌ మోడల్‌కు తాము అంగీకరించాలంటే భారత్‌లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్‌కు వెళ్లమని పాక్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement