విదేశాల్లో మరోసారి బయటపడ్డ టీమిండియా బలహీనతలు | Hard truths: Team India overseas challenge returns | Sakshi
Sakshi News home page

విదేశాల్లో మరోసారి బయటపడ్డ టీమిండియా బలహీనతలు

Jul 8 2026 10:49 AM | Updated on Jul 8 2026 11:02 AM

Hard truths: Team India overseas challenge returns

ఇంగ్లండ్‌ చేతిలో మూడో టీ20 ఓటమితో మరోసారి తేలిన చేదు నిజం

విదేశాల్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో వరుసగా విఫలమవుతున్న భారత బ్యాటర్లు

ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఒకే తరహా బలహీనత

పక్కా వ్యూహంతో భారత్‌ను కట్టడి చేసిన ఇంగ్లండ్ పేసర్లు
 

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత్ ఎదుర్కొన్న 125 పరుగుల భారీ ఓటమి కేవలం ఒక్కరోజు పేలవ ప్రదర్శన మాత్రమే కాదు. విదేశీ పర్యటనల్లో భారత బ్యాటింగ్‌లో పదేపదే కనిపిస్తున్న సాంకేతిక లోపాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. 

ముఖ్యంగా పేసర్లు గుడ్ లెంగ్త్, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ (6 నుంచి 10 మీటర్ల మధ్య) ప్రాంతంలో సంధించే బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌటవడం నిజంగానే చాలా దారుణం. ప్రప​ంచ ఛాంపియన్‌ అయిన జట్టు ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం మరీ దారుణం.

ఈ సమస్య ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. 2025 ఆసియా కప్, 2026 ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లలో హార్డ్ లెంగ్త్ బంతులపై భారత బ్యాటర్ల సగటు వరుసగా 18.42, 17.17, 14.29 మాత్రమే ఉంది. 

అదే సమయంలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ఇదే తరహా బంతులపై భారత బ్యాటర్లు 47.70 సగటుతో, 165.63 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. ఈ గణాంకాలు స్వదేశం, విదేశాల్లో భారత బ్యాటింగ్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి.

వ్యక్తిగత ప్రదర్శనలను పరిశీలిస్తే తిలక్ వర్మ మాత్రమే హార్డ్ లెంగ్త్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కొంత మేర పర్వాలేదనిపించినా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఐదు సార్లు ఔటై కేవలం 20 పరుగులే చేయడం ఆందోళన కలిగించే అంశం.

విశేషమేమిటంటే, ఇదే పిచ్‌పై భారత పేసర్లు తొలుత హార్డ్ లెంగ్త్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. ఆరంభంలో స్వింగ్, ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బంతులతో పరుగులను నియంత్రించారు. అయితే ఆ వ్యూహాన్ని ఇంగ్లండ్ బౌలర్లు మరింత సమర్థంగా అమలు చేశారు.

జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా హార్డ్ లెంగ్త్ బంతులు సంధించారు. ఆర్చర్ మొదట వైభవ్ సూర్యవంశీకి వైడ్‌గా బంతి వేసి సిక్సర్ ఇచ్చినా, వెంటనే లైన్ మార్చి బౌన్సర్‌తో అతడిని ఔట్ చేశాడు.

టంగ్ కూడా పూర్తి లెంగ్త్‌తో ప్రారంభించి వెంటనే హార్డ్ లెంగ్త్‌కు మారి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అనంతరం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ఈ లెంగ్త్‌కు ఇబ్బంది పడ్డారు. ఆర్చర్, టంగ్ కలిసి 6 నుంచి 10 మీటర్ల లెంగ్త్‌లో వేసిన 26 బంతుల్లో ఐదు వికెట్లు తీసి కేవలం 24 పరుగులే ఇచ్చారు.

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. "ఈ పిచ్‌పై గుడ్ లెంగ్త్‌లో బంతులు వేస్తే షాట్లు ఆడటం చాలా కష్టమని మేం ముందే గుర్తించాం. అందుకే అదే వ్యూహాన్ని అమలు చేశాం" అని వెల్లడించాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ ఓటమిని ఒక్క మ్యాచ్ ఫలితంగా మాత్రమే చూడలేం. గత కొంతకాలంగా విదేశాల్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది మరో ఉదాహరణ. ఈ బలహీనతను సరిదిద్దుకోకపోతే, రానున్న విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేసి టీమిండియాను ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement