టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్’ గ్రేడ్ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు.
వీరిలో కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, జడేజా కూడా ఉన్నారు.
బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు.
కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా టాప్-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.


