148 పరుగులు.. 8 వికెట్లు

Australia Bowl Out India For 244 - Sakshi

కమిన్స్‌ విజృంభణ

టీమిండియా 244 ఆలౌట్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో పూర్తి ఆధిక్యం కనబరిచిన టీమిండియా.. మూడో రోజు ఆటలో పూర్తిగా తడబడింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా(50; 176 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్‌ సెంచరీ సాధించగా, రిషభ్‌ పంత్‌(36; 67 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.  రహానే(22) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,  రవీంద్ర జడేజా(28 ‌) అజేయంగా నిలిచాడు. 96/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ఆటలో రహానేనకు కమిన్స్‌ పెవిలియన్‌కు పంపగా,  ఆపై హనుమ విహారి(4) రనౌట్‌ అయ్యాడు.

ఆ తరుణంలో పుజారా- పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 53 పరుగులు జత చేసిన తర్వాత పంత్‌ను హజల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. దాంతో టీమిండియా 195 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోగా, అదే స్కోరు వద్ద పుజారాను కమిన్స్‌ ఔట్‌ చేశాడు.  ఆ సమయంలో జడేజా-అశ్విన్‌లు ప్రతిఘటించే యత్నం చేశారు. కాగా, అశ్విన్‌(10) ఏడో వికెట్‌గా ఔటైన కాసేపటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. జడేజా మాత్రం కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో భారత్‌ 240 పరుగుల మార్కును దాటింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు కంటే టీమిండియా 94 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 

కమిన్స్‌ విజృంభణ.. ముగ్గురు రనౌట్‌
నిలకడగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను కమిన్స్‌ దెబ్బ కొట్టాడు. నాలుగు వికెట్లు సాధించి టీమిండియాను కట్టడి చేశాడు. గిల్‌, పుజారా, రహానే, సిరాజ్‌లను కమిన్స్‌ ఔట్‌ చేశాడు. కాగా,  కమిన్స్‌ విజృంభణకు తోడు ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు రనౌట్‌ కావడం కూడా వెనుకబడేలా చేసింది. హనుమ విహారి, అశ్విన్‌, బుమ్రాలు తమ వికెట్లను రనౌట్ల రూపంలో సమర్పించుకున్నారు.  హజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు లభించగా,  స్టార్క్‌కు వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top