శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో భారత-ఏ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 132 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అంతకంటే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సాయి 267 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 168 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ సుదర్ఘీ ఇన్నింగ్స్ సాయిలోని స్టామినాను మరోసారి చూపింది. సాయి భారత టెస్ట్ జట్టులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో అతడి నుండి విదేశీ గడ్డపై రెండు భారీ ఇన్నింగ్స్లు రావడం శుభపరిణామం.
సాయి టీమిండియా తరఫున వన్డౌన్లో ఆడతాడు. ఆఫ్ఘనిస్తాన్తో తాజాగా జరిగిన ఏకైక టెస్ట్లో అతడు 81 పరుగులు చేశాడు. ఓవరాల్గా టెస్ట్ కెరీర్లో 12 ఇన్నింగ్స్లు ఆడిన సాయి 3 అర్ద సెంచరీల సాయంతో 383 పరుగులు చేశాడు. శ్రీలంక-ఏపై తాజా సెంచరీలు సాయికి తదుపరి టెస్ట్ మ్యాచ్ల్లో మంచి బూస్టప్ ఇస్తాయి.
భారత జట్టు ఆగస్ట్లో శ్రీలంక పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్లో సాయి తాజా అనుభవం టీమిండియాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత-ఏ జట్టులో ఉన్న సభ్యుల్లో సాయి ఒక్కడే భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు.
వర్షం అంతరాయం
రెండో టెస్ట్ మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ స్కోర్ 406-4 వద్ద ఉండగా వర్షం మొదలైంది. ఆ సమయానికి టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. సాయి సుదర్శన్ (168) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని, దేవ్దత్ పడిక్కల్ (94) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
కెప్టెన్ ధృవ్ జురెల్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ అమన్ మోఖడే 38 పరుగులకు ఔటయ్యాడు. షేక్ రషీద్ (16), సరాన్ష్ జైన్ (2) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు లంక ఇన్నింగ్స్లో కెప్టెన్ సహాన్ అరచ్చ్చిగే (127) సెంచరీతో కదంతొక్కాడు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ తలో 4 వికెట్లతో రాణించారు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.


