‘చేయూత’కు ఈ నెలాఖరు డెడ్లైన్
● జిల్లాలో ఇప్పటివరకు 9,611దరఖాస్తులు
● సింహభాగం బల్దియాల్లోనే
● అత్యధికంగా వితంతువు కేటగిరీలో..
● అత్యల్పంగా ఒంటరి మహిళ..
సిద్ధిపేటజోన్: చేయూత పథకం కింద సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. కొత్తగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలు పెరిగాయి. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో 9,611దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ స్వీకరించింది. వీటిలో సింహభాగం జిల్లాలోని బల్దియాల్లోనే దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా వితంతువు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులతో పాటు పైలేరియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మొదట మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగానే ఆయా కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించారు. కొన్ని రోజులుగా జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని వెంటవెంటనే ఆన్లైన్ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఆగస్టు31 గా ప్రకటించారు.
బల్దియాల్లో 1,872 అప్లికేషన్లు
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు చేయూత పథకం కింద కొత్తగా 1,872 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 840 రాగా అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో 152 వచ్చాయి. వీటిని నిర్ణీత గడువు పూర్తి అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందించేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


