గజ్వేల్: తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడూ జరగలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఆదివారం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడి నుంచి గజ్వేల్ స్టేషన్ వరకు మెదక్ ఎంపీ రఘునందన్రావుతో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర, ఇతర అంశాల ఆధారంగా రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతీ రైల్వేలైన్ను విద్యుదీకరించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ముంబై వయా పుణే, హైదాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–అమరావతి–చైన్నె మూడు బుల్లెట్ ట్రైన్లు, 5 వందేభారత్, మరో ఆరు అమృత్ రైళ్లను నడపడానికి నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధిపైనా దృష్టి పెట్టామన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ను మరో రూ.40కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నుంచి వచ్చే భక్తులకు ఈ రైలులో అతిచౌకగా రూ.25తో ప్రయాణించి కొమురవెల్లి మల్లన్నను దర్శనం చేసుకోవచ్చున్నారు. రూ.100కే నెల పాస్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వేలైన్ల విద్యుదీకరణ, ఇతర సదుపాయాల కల్పన
కొత్తగా మరిన్ని బుల్లెట్, వందేభారత్, అమృత్ రైళ్లు
యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్
కేంద్రమంత్రి కిషన్రెడ్డి
కొమురవెల్లి నుంచి గజ్వేల్ వరకు రైలులో ప్రయాణం


