● ఘనంగా మహంకాళీ అమ్మవారి బోనోత్సవం
● అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్రావు
గజ్వేల్రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటామని, ఆషాఢమాసంలో భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఆషాఢమాసంలో నిర్వహించే మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహంకాళీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిత్యపూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి చాడ నందబాలశర్మ, పూజారి విఠాల సాయికృష్ణశర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతోపాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు భాస్కర్, రాజమౌళి తదితరులు మహంకాళీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ... ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. పట్టణంలోని మహిళలు, ఆడపడుచులు బోనాలను అందంగా అలంకరించి నెత్తిన పెట్టుకుని పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల మధ్య దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళీ దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.


