అడిషనల్ కలెక్టర్ పాండు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదును పెంచాలని అడిషనల్ కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పాఠశాల ప్రవేశాల నమోదు, డ్రా పౌట్ విద్యార్థుల పునః ప్రవేశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 5 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు సమారు 5,903 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. గతేడాది మొదటి తరగతిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందగా.. ఈ ఏడాది అన్ని తరగతులు కలిపి లక్షా 24 వేల మందిని ప్రవేశాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా డ్రా పౌట్, పాఠశాలకు ఎప్పుడు హాజరు కాని పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, యువజన కమిటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, జూన్ 3వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి పాఠశాల ప్రవేశాలపై ప్రచారం చేపట్టాలన్నారు. జూన్ 4న స్కూల్లలో సమావేశాలు, జూన్ 6న గ్రామస్థాయి, నగర స్థాయి విద్యార్థుల గుర్తింపు కార్యక్రమంతో పాటు జూన్ 8న ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే పాఠశాలలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈఓ స్వప్న, మెప్మా పీడీ రామాచారి, ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్, సోషల్ వెల్ఫేర్ అధికారి అఖిలేష్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, డీటీడీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


