సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్
వట్పల్లి(అందోల్): యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మండల పరిధిలో శనివారం కలకలం రేపింది. ఎస్ఐ లవకుమార్ వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి శనివారం వారి వ్యవసాయ బావి వద్ద ఉన్న దర్గాకు వెళ్లి మొక్కులు చెల్లించేందుకు తన తమ్ముడితో కలిసి బైక్పై వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో యువతి మేన బావలు ఇటిక్యాల శ్రీకాంత్, ఇటిక్యాల జగదీశ్వర్తో పాటు మరో వ్యక్తి మామిడిపల్లి లక్ష్మణ్తో కలిసి కారులో వచ్చి వారిని అడ్డగించారు. యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యారు. ఈ క్రమంలో యువతి సోదరుడు వారిపై ఎదురుదాడికి దిగినా అతడ్ని పక్కకు నెట్టేశారు. అతడు వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించాడు. అలాగే బైక్పై కారును వెంబడించాడు. అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ లవకుమార్, ఎస్ఐ శ్రీహరి, పుల్కల్ ఎస్ఐ విశ్వజన్లతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి పుల్కల్ గ్రామ శివారులో కిడ్నాపర్లను పట్టుకున్నారు. దీంతో అమ్మాయి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఆమె కుటుంబీకులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడంతోనే కిడ్నాప్ చేశామని నిందితులు విచారణలో తెలిపారు. కాగా చిత్ర హింసలు పెట్టినట్లు బాధితురాలు పేర్కొంది. ముగ్గురిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.
నిందితులు స్వయానా మేనబావలు
రెండు గంటల్లోనే పట్టుకున్న పోలీసులు


