
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 27 వరకు ఆన్లైన్లో స్వీకరణ
వర్గల్(గజ్వేల్): స్థానిక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి గడువు పొడిగించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 27 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఆదేశాలు జారీచేసింది. బుధవారంతో గడువుతేదీ ముగియాల్సి ఉండగా, పాలనాపరమైన కారణాలు, విద్యార్థుల సౌలభ్యం కోసం నవోదయ విద్యాలయ సమితి గడువు పొడిగించిందని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
సిద్దిపేటజోన్: స్కూల్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అండర్ 15 బాలబాలికల వాలీబాల్ జట్ల సభ్యులను ఎంపిక చేశారు. స్థానిక గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సెలెక్షన్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 150మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఎనిమిది మందిని బాలికల జట్టుకు, అదేవిధంగా మరో ఎనిమిది మందిని బాలుర జట్లకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 18,19 తేదీల్లో ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియ ఎస్జీఎఫ్ కార్యదర్శి సౌందర్య పర్యవేక్షించారు
రైతు సంఘం జిల్లా
కార్యదర్శిగా వెంకట్మావో
చేర్యాల(సిద్దిపేట): రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ముస్త్యాల గ్రామానికి చెందిన కొంగరి వెంకట్మావో ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో చల్లారపు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెంకట్మావోను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్మావో మాట్లాడుతూ జిల్లాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
దుండగులను శిక్షించాలి
గజ్వేల్: పట్టణంలో భగత్సింగ్ విగ్రహ గద్దెను కూల్చేసిన దుండగులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విగ్రహ గద్దెను కూల్చేసిన ప్రదేశాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాంచంద్రం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ తదితరులు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్సింగ్ విగ్రహా ఏర్పాటుపై కుట్రలు సహించేదిలేదన్నారు. అనంతరం వారు ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్, టీపీటీఎఫ్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిట్టాపూర్లో విషజ్వరాలు..
దుబ్బాకరూరల్: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులు భూంపల్లి ప్రాథమిక ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో వారికి జ్వరం తగ్గక పోవడంతో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది గ్రామంలో జ్వర సర్వే నిర్వహించి, శానిటేషన్ చేశారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకు పోవడంతోనే విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేయడంలేదని అన్నారు.

నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు

నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు