● కలెక్టరేట్కు భారీగా తరలివచ్చిన ప్రజలు
● మండల కేంద్రాల్లో పరిష్కారం కాని సమస్యలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల్లో పకడ్బందీగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రజలకు ఎదురవుతున్న పలు రకాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ తో పాటు డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తుండగా తాజాగా రెండు వారాలుగా మండలస్థాయిలో ప్రజా వినతులు స్వీకరిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు సంగీత, పాండు హాజరై వినతులు స్వీకరించగా మండల కేంద్రాల్లో సంబంధిత ఎంపీడీఓలు స్వీకరించారు.
రెవెన్యూ సమస్యలే అధికం
కలెక్టరేట్లో 41, సంగారెడ్డి డివిజన్లో 22, జహీరాబాద్లో 05, నారాయణఖేడ్లో 03 వినతులు అందగా, అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న మండలాల్లో మొత్తం 56 అర్జీలు వచ్చాయి. అత్యధికంగా హత్నూర, సదాశివపేట మండలాల్లో 10, పటాన్చెరులో 8 రాగా, పలు మండలాల్లో ఒకటికి పరిమితం కాగా ఇతర మండలాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు ఖాళీగా కూర్చున్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధిత సమస్యలే అత్యధికంగా వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా హౌసింగ్, పెన్షన్, ఆర్టీసీ, నిమ్జ్, ఉద్యోగ, ఉపాధి తదితర వాటిపై వచ్చా యి. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాకపోవడంతోనే కలెక్టరేట్కు వస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు.


