ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ‘కాంగ్రెస్ 1000 రోజుల పాలన– 420 మోసాలు’ పేరుతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు చేపట్టనున్న ఏడు రోజుల నిరసన కార్యక్రమాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఏడు రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల నిర్వహణపై నాయకుల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల విధ్వంసక పాలనపై ప్రజల తరఫున పోరాడే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడంతో పాటు అదనంగా మరిన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ‘బాకీ కార్డుల’ రూపంలో హామీలను ప్రతి గడపగడపకు చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


