ఎల్‌పీజీకీ ఈకేవైసీ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌పీజీకీ ఈకేవైసీ

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

31 వరకు గడువు పెంపు

అనుసంధానించని పక్షంలో కనెక్షన్‌ తొలగింపు

బోగస్‌ కనెక్షన్ల ఏరివేతకు చర్యలు

నారాయణఖేడ్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ (ఎల్‌పీజీ) వినియోగదారులకు ఈ– కేవైసీ గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 16 తర్వాత 23వ తేదీ నాటికి ఈ– కేవైసీ పూర్తి చేయని వినియోగాదారులకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్‌ యువర్‌ కస్టమర్‌ (ఈ–కేవైసీ) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్‌ కంపెనీలు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాయి. ఆయా కంపెనీలకు సంబంధించి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 6 లక్షల పైచిలుకున్నాయి. ప్రతీ రోజు 10వేల సిలిండర్ల వినియోగం జరుగుతుంది.

బోగస్‌ ఏరివేతకే!

బోగస్‌ కనెక్షన్లు, అర్హత లేని లబ్ధిదారులు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న కనెక్షన్లు, ఒకే కుటుంబానికి ఉన్న డూప్లికేట్‌ కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు కేంద్రం ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇకపై రీఫిల్‌ సిలిండర్‌ బుకింగ్‌, డెలివరీ నిలిచిపోనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కనెక్షన్‌ రద్దు చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా ఈ–కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో పలుమార్లు గడువు విధించినప్పటికీ వంద శాతం ఈ–కేవైసీ పూర్తి కాలేదు. ఫలితంగా ఆయిల్‌ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తిరిగి ఈనెలాఖరుగా చివరి అవకాశం కల్పించాయి.

అర్హులకే సబ్సిడీ

ఎల్‌పీజీ కనెక్షన్లు క్రమబద్దీకరించడంతోపాటు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని అందించేందుకు ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. కొన్ని ప్రాంతాల్లో మరణించిన వ్యక్తుల పేర్లతోనే గ్యాస్‌ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. అర్హతలేని వ్యక్తులు, ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కొనసాగుతున్న సందర్భాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి కనెక్షన్లను ఈ–కేవైసీ ద్వారా ఫిల్టర్‌ చేసి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియలో వినియోగదారుల గుర్తింపు నిర్ధారించేందుకు ఆధార్‌ వివరాలతోపాటు బయోమెట్రిక్‌ సమాచారాన్ని తీసుకుంటున్నారు. వేలిముద్ర, ఐరిస్‌ వంటి వివరాలను ఎల్‌పీజీ డొమెస్టిక్‌ కనెక్షన్లకు అనుసంధానం చేయడం ద్వారా అసలైన వినియోగదారులను గుర్తించవచ్చని ఆయిల్‌ కంపెనీలు నిర్ణయించాయి. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ముందుగా రీఫిల్‌ సిలిండర్‌ బుకింగ్‌, డెలివరీపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఇప్పటికే బుక్‌ చేసిన సిలిండర్లు కూడా రద్దయ్యే పరిస్థితి ఉండొచ్చు. భవిష్యత్తులో కనెక్షన్‌ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేని సిలిండర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement