సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వాటిని నిరంతరం సంరక్షించాలని సూచించారు. చెట్లు పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని, తద్వారా మొక్కల వివరాలను నమోదు చేసి వాటి సంరక్షణపై పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, డీఎంహెచ్ఓ లలితాదేవి, ప్రిన్సిపాల్ ప్రవీణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


