జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంతో పాటు రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచారం, వరకట్నం, మరణాల కేసుల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు జరపాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం ప్రతి నెలా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లు నిర్వహించి అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. నేరాల అణచివేతలో సీసీ కెమెరాల పాత్ర కీలమని, వీటి ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జహీరాబాద్ ప్రాంతం ఇతర రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున నిత్యం నాకాబందీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. అలాగే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి వెంటనే తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్, రూరల్ సీఐలు రవి, హన్మంత్, ఎస్ఐలు లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


