జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరి పండించిన రైతులకు ఇస్తున్న విధంగానే చెరుకు సాగు చేస్తున్న రైతులకు కూడా బోనస్ ఇచ్చి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ముబీన్ అధ్యక్షతన గురువారం చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చెరకు పంటను సాగు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు. వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లుగానే చెరుకు పంటకు టన్నుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒక మారు రైతులకు ఉచితంగా విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరుకు పంటకు అధికంగా అవరమయ్యే మినీ ట్రాక్టర్లను సబ్సిడీపై అందించాలని కోరారు. చెరుకుసాగు వల్ల ప్రభుత్వానికి పలు విధాలుగా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెరుకు కోత యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సహాయం అందించాలని, అవసరం మేరకు డ్రిప్ పరికరాలు అందజేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త విజయ్కుమార్ దిగుబడులపై ఎల్ నినో ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించారు. సమావేశంలో స్టేట్ షుగర్ ఇండస్ట్రీ డివిజినల్ కమిటీ సభ్యుడు గడీల రాంరెడ్డి, రాయికోడ్ సీడీసీ చైర్మన్ ముబీన్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీడీసీ సమావేశంలో రైతుల డిమాండ్


