సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. ప్రభుత్వం రూసా 2.0 ఆధ్వర్యంలో ఉన్నత విద్యాభివృద్ధి, అంతర్జాతీయ విద్యా సహకారాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా, అధ్యయన పర్యటనలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. వారం రోజులుగా జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో కొనసాగిన పర్యటన అనుభవాలను మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులకు ఆమె వివరించారు. తమ బృందం ఆఖెన్, ఓస్ట్పోలియో, గొట్టింగెన్, మ్యూనిక్ యూనివర్సిటీలోని ప్రముఖ విద్యా సంస్థల్లో పర్యటించినట్లు చెప్పారు. అక్కడి విద్యావిధానాలు, పరిశోధనా వ్యవస్థలు, ఆవిష్కరణలు, పరిశ్రమ, విశ్వవిద్యాలయ అనుసంధానం, అంతర్జాతీయ విద్యా సహకార అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం అధ్యాపకులు రోహిణిని అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, డా. సీహెచ్ మధుసూదన్, డా. లీలావతి, దాసు తదితరులు పాల్గొన్నారు.


