సంగారెడ్డి జోన్: వానాకాలం సీజన్ వ్యవసాయ పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. సాగుకు పెట్టుబడి సాయంగా తొలి విడతలో రెండు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. జిల్లాలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 2,42,753 మంది రైతులకు రూ.125.83 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్లో మంగళవారం శిల్పారామం వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డిలతో కలిసి బటన్నొక్కి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సాయంత్రానికి రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. విత్తన కొనుగోలు, పురుగు మందులు, తదితర వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోనున్నారు. మిగతా రైతులకు విడతలవారీగా నిధులు త్వరలో జమ కానున్నాయి.
రైతు సంక్షేమమే లక్ష్యంగా...
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, రైతులు తదితరులున్నారు.
రైతు భరోసా నిధుల విడుదల
విడతలవారీగా రైతుల ఖాతాలో జమ
తొలి విడతలో రెండు ఎకరాల వరకు
రైతు వేదికలో పాల్గొన్న టీజీఐఐసీ
చైర్పర్సన్, కలెక్టర్ తదితరులు


