పటాన్చెరు టౌన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా ఇంతవరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని..ఇది అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతేడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందగా..8 మంది ఆచూకీ తెలియకపోవడంతోపాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం మూలంగా జరిగిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణంగా ఉందని దుయ్యబట్టారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమ యాజమాన్యాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం తప్ప బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంత్రి వివేక్ రూ.60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో రూ.118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వంఅనుమతించకపోవడం దుర్మార్గ వైఖరికి అర్థం పడుతోందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్జి చార్జ్ ఆదర్శ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి


