నారాయణఖేడ్: సమాజంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఖేడ్ మండలం పంచగామలో మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు వారాలకుపైగా తగ్గని దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం క్షయవ్యాధి ప్రధాన లక్షణాలని తెలిపారు. లక్షణాలున్నవారు ప్రభుత్వ వైద్యశాలలో వెంటనే ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, వైద్యం, మందులు ఉచితంగా అందజేయడమే కాకుండా బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసహాయం, పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. వైద్యాధికారి డా.అఖిల, ఆరోగ్య సహాయకులు జెట్ల భాస్కర్, ప్రకాష్, సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్రెడ్డి, ఏఎన్ఎం జానకి పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమానికి రైతులు బస్సుల్లో తరలివెళ్లగా జెండా ఊపి సాగనంపారు. రైతుభరోసా, రాయితీపై వ్యవసాయపనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు, వడ్లకు బోనస్ తదితర రైతుసంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, డివిజన్ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


