దొబ్బకుంట తండా పంచాయతీ బయట పడి ఉన్న ప్రభుత్వ మందులు, వాటిపై గడువు ముగియని తేదీ..
కొండాపూర్ (సంగారెడ్డి): ప్రభుత్వ మందులు గ్రామపంచాయతీ కార్యాలయం బయట కనిపించడం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. గడువు ముగియని మందులు బహిరంగ ప్రదేశంలో పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ మందులు సాధారణంగా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిసిన మందులైతే నిర్దిష్ట బయో మెడికల్ వ్యర్థాల నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వీర్యం చేయాలి. కానీ మండల పరిధిలోని దొబ్బకుంట తండాలో సర్కారు పంపిణీ చేసే మందులు సోమవారం పంచాయతీ కార్యాలయం బయట దర్శనమిచ్చాయి. సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఒకవేళ చిన్నారులు ఆ మందులను మింగితే పరిస్థితి ఏంటని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


