నర్సాపూర్ రూరల్: లేగదూడపై హైనా దాడి చేసి చంపింది. ఈ సంఘటన మండలంలోని నత్నయపల్లిలో ఆదివారం వేకువ జామున చోటు చేసుకుంది. స్థానికులు, అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉషన్నగారి శ్రీనివాస్ లేగ దూడపై హైనా దాడి చేయగా మృతి చెందింది. పదేళ్ల క్రితం నత్నయపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతలు సంచరించి పశువులపై దాడి చేశాయి. కాగా ఆదివారం లేగ దూడ మృతి చెందడంతో తిరిగి చిరుతలు వచ్చినట్లు భావించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ క్షేత్రాధికారి దివ్య, సాయికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దర్యాప్తులో చిరుత కాదని హైనా తేల్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
నర్సాపూర్ రూరల్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిరుమలాపూర్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన విఠల సరిత(40), ఆమె కుమారుడు శ్రావణ్ను వెంటపెట్టుకొని పశువులను మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చెరువు వద్దకు రాగానే ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో సరిత అక్కడికక్కడే మృతి చెందగా, శ్రవణ్కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రోడ్లను ఆక్రమిస్తూ పరిశ్రమల వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్రమ పార్కింగ్పై స్థానికులు ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ పార్కింగ్ వల్ల గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
జహీరాబాద్: అజ్మీర్ షరీఫ్ దర్గా సజ్జాదా నషీన్, అఖిల భారత సూఫీ సజ్జాదానషీన్ కౌన్సిల్ చైర్మన్ హజ్రత్ సయ్యద్ నసీరుద్దీన్ చిస్తీ జహీరాబాద్కు వచ్చిన సందర్భంగా సత్కరించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తూ జహీరాబాద్లోని ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, మున్సిపల్ చైర్మన్ యూనూస్, ముస్లిం నేతలు సత్కరించారు. కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.
శివంపేట (నర్సాపూర్): పేకాట రాయుళ్లను ఆదివారం మెదక్ సీసీఎస్, స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని కొత్తపేట గ్రామ శివారు నిర్మాణంలో ఉన్న ఇంట్లో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 22,930 నగదు, 5 ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా... ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


