పటాన్చెరు టౌన్: విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని, దీంతో 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మూడేళ్లలో వరుసగా పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, యువరాజ్ , సాయిలు ముదిరాజ్, అక్షిత్, శ్రీనివాస్, రతన్ సింగ్, మల్లేశ్, అంజయ్య, రాజు సింగ్ పాల్గొన్నారు.


