హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పీపుల్స్ వార్ అమరుల స్థూపానికి సంబంధించిన సీలింగ్ భూములు ప్రజలకే చెందాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అమరుల స్తూపాన్ని జేఏసీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణంలో నిర్మించిన అమరువీరుల స్తూపం ఆసియా ఖండంలోనే అతి పెద్దదన్నారు. స్తూపాన్ని కూల్చారని, దీనికి చెందిన 4 ఎకరాల భూమి రిటైర్డ్ డీఎస్పీ రామచంద్రారెడ్డి పట్టా భూమి కాదని, సీలింగ్ భూములని తెలిపారు. ఆయన హైకోర్టుకు వెళ్లినా ఈ భూములు కాశతురుక, ఎస్సీల భూములని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ భూముల్లో రామచంద్రారెడ్డి కుమారుడు భవనం నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ భూముల వ్యవహారం ఆగాలంటే ఆందోళన కార్యక్రమాలే శరణ్యమన్నారు. భూములు కాపాడుతానని పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చారని, ఆయన మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీపీఐ నాయకులు సత్యనారాయణ, మల్లేశ్ , అశోక్ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి


