చేర్యాల(సిద్దిపేట): అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన బస్వరాజు రాజయ్య(70) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పనులు చేయవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
న్యాల్కల్(జహీరాబాద్): అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని రేజింతల్ గ్రామంలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొట్పల్లి పాండు(25) శనివారం మొహర్రం పండుగ సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పాండుకు ఫోన్ చేయగా కాశీంపూర్కు వచ్చానని, ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. ఆదివారం ఉదయం ఆయన తల్లి పొలానికి వెళ్లగా అక్కడ పాండు చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తల్లి బిచ్చమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


