నారాయణఖేడ్: ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచే యాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు కేవలం 250 మంది విద్యార్థులే ఉండగా ఈసారి 25 మంది మాత్రమే అడ్మిషన్లు పొందడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫలితాలను పరిశీలించి విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు ఎందుకు తక్కువగా వస్తున్నాయని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెడుతూ నిత్యం గంట అదనంగా పనిచేస్తూ స్టడీఅవర్ నిర్వహించాలని సూచించారు. మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఖేడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవెంట్ డిజిటల్ సంస్థ సౌజన్యంతో 10 ల్యాప్టాప్లను, లయన్స్క్లబ్ హైదరాబాద్ సౌత్ ఆధ్వర్యంలో 200 భోజనం ప్లేట్లు, నోట్బుక్స్ను పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. స్వచ్చంద, కార్పొరేట్ సంస్థలు ఖేడ్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు.


