మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్
వట్పల్లి(అందోల్): అందోల్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలను నిలువునా పాతరేస్తూ అధికారుల అండదండలతోనే అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. ప్రభుత్వ సంపదను, ప్రకృతి మూలాలను కొందరు స్వార్థపరులు కొల్లగొడుతుంటే అధికారులు మౌనం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. మైనింగ్, రెవెన్యూ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గుట్టల తవ్వకాలు చేపడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది టిప్పర్లు, జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణానికి అవసరమై ఒక ట్రాక్టరు మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేసే అధికారులు పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకం దారులపై కేసులు నమోదు చేయడంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.


