ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం
జహీరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా కల్యాణలక్ష్మి–షాదీముబారక్ హామీ అటకెక్కుతోందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆర్థికసాయంతోపాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక బంగారాన్ని మర్చిపోయిందని, ఆర్థిక సహాయం కూడా సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా ఉందన్నారు. తులం బంగారం ప్రస్తుత ధర ప్రకారం ఈ హామీ అమలు చేయడానికి సుమారు రూ.22వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ నగదు సహాయానికి రూ.500 కోట్లు అవసరం అవుతాయని, తులం బంగారం కలిపితే మొత్తం రూ.1,225 కోట్ల మేర అవుతుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే 5వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటికి తులం బంగారం కలిపితే సుమారు రూ.72 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే లబ్ధిపొందిన వా రికి, కొత్త లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చి మా ట నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


