● నిందితుడి రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు
రాయికోడ్(అందోల్): మహిళను హత్య చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాయికోడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్య కిరన్తో కలిసి జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంతు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 17న మండలంలోని సింగితం గ్రామానికి చెందిన లలిత(53) కనిపించకుండా పోయింది. ఆమె కూతురు ప్రభావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20న సింగితం గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో లలిత మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మృతురాలి మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి గ్రామానికి చెందిన ఎం.భాస్కర్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆభరణాల కోసమే లలితను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు గుండ్లు, ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.


