జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీతోపాటు గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్) కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను గురువారం ఓటర్లకు పంపిణీ చేశారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ బూత్లలో ఆర్డీఓ దేవుజా, మున్సిపల్ కమిషనర్ జి.ప్రభాకర్ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని పరిశీలించారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి పత్రాలను అందజేశారు. వాటిని పూరించి ఇవ్వాలని ఓటర్లకు సూచించారు. ఒక్కో బూత్కు ఒక బీఎల్ఓను నియమించారు. శిక్షణ పొందిన వీరు తమ బూత్ పరిధిలో ఉన్న ఓటర్లకు రెండేసి వంతున ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. మూడు రోజుల పాటు ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తారని అధికారులు పేర్కొ న్నారు. అనంతరం వారి వద్ద నుంచి పూర్తి చేసిన పత్రాలను బీఎల్ఓలు తిరిగి సేకరిస్తారు. పోలింగ్ బూత్ల వారీగా ఒక బీఎల్ఓకు 600 నుంచి 1,200 మంది వరకు ఓటర్లను కేటాయించారు. 2002లో ఓటరు జాబితాలో పేరు ఉండి, ప్రస్తుతం కూడా అదే పేరు ఉంటే సదరు ఓటర్లు ఎలాంటి ఆధారాలను జతచేయాల్సిన అవసరం లేదని, వీరిని రెగ్యులర్ ఓటర్లుగా గుర్తించడం జరుగుతుందని వివరించారు. 2002లో ఓటరు జాబితాలో పేరు లేకుండా, ప్రస్తుత జాబితాలో పేరున్న వారు ఎన్యూమరేషన్ పత్రాలతోపాటు సంబంధిత పత్రాలను జతచేసి అందజేయాలని బీఎల్ఓలు ఓటర్లకు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు మినహా చదువుకున్న సర్టిఫికెట్లతోపాటు 12 రకాల్లో అవసరమైన ఎవిడెన్స్ పత్రాలను జతచేయాలని పేర్కొన్నారు. సర్ కార్యక్రమం వల్ల డబుల్ ఓట్లు ఉంటే తొలగిపోతాయి. అంతే కాకుండా చనిపోయిన వారివి, మరో ప్రాంతానికి షిఫ్ట్ అయిన వారివి పోవడంతోపాటుగా అక్రమచొరబాటుదారుల ఓట్లు కూడా తొలగిపోనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని సరిగ్గా ఉన్నట్లయితే స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. బీఎల్ఓలు ఓటర్ల దగ్గరకు వెళ్లితే ఇంటి వద్ద లేకుంటే వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వివరాలు సేకరించాల్సి ఉంటుంది.
పకడ్బందీగా ప్రత్యేక ఓటరు జాబితా
సర్ తీరును పరిశీలించిన ఆర్డీఓ దేవుజా, కమిషనర్ ప్రభాకర్
సంగారెడ్డి టౌన్: మండలంలో సర్ ప్రక్రియను బీఎల్ఓలు పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ జయరాం స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంతోపాటు మండలంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రతీ పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేస్తారని వారికి ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు,బీఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.