దుబ్బాకటౌన్: మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ఊపిరాడక మృతి చెందాడు. దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ మహమ్మద్ సజిల్ (46), తన భార్యతో కలిసి డబుల్ బెడ్రూం ప్రభుత్వ గృహ సముదాయంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి అయినా తిరిగి రాలేదు. కాగా, పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత రోడ్డులోని ఒక వస్త్ర దుకాణం సమీపంలో ఉన్న మురుగునీటి కాల్వ వద్దకు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సజిల్, ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. మురుగునీరు మింగడంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలో పడి ఉన్న సజిల్ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాకలోని వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య నజీమా భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


