● జిల్లాలో 7,62,580 ఎకరాల్లో సాగవనున్న పంటలు ● గతేడాదితో పోలిస్తే 7,594 ఎకరాలు అధికం ● ఈసారి కూడా అధిక విస్తీర్ణంలో సాగవనున్న పత్తి!
న్యాల్కల్(జహీరాబాద్): రానున్న ఖరీఫ్(వానాకాలం) సీజన్కు సంబంధించి పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 3,82,511 ఎకరాల్లో పత్తి, వరి 1,59,070, కంది 75,557, సోయాబీన్ 61,312, చెరకు 27,986, మొక్కొన్న 9,563, పెసలు 8,491, మినుము 5,792, ఉద్యాన వన పంటలు 30,956 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటితోపాటు ఇతర పంటలు అతి తక్కువ విస్తీర్ణంలో సాగవనున్నట్లు పేర్కొంది.
7,594 అధికం
గతేడాది 7,54,986 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అంచనా వేసిన వ్యవసాయ శాఖ ఈసారి 7,594 ఎకరాల్లో అధికంగా సాగు కానున్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే పత్తి 3,734 ఎకరాల్లో , వరి 1,574, చెరుకు 807, కంది 764, సోయాబీన్ 628 , ఉద్యాన పంటలు 312, మొక్కజొన్న 155, పెసలు 87, మినుము 56 ఎకరాల్లో అధికంగా సాగవుతాయని పేర్కొంది.
విత్తనాలు
వానాకాలం పంటల సాగుకు సంబంధించి అవసరమయ్యే విత్తనాల ప్రణాళికలను కూడా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరికి 39,779 క్వింటాళ్లు, సోయాబీన్కు 18,500, మొక్కజొన్నకు 770, కందికి 3,023, పెసలుకు 340, మినుముకు 232 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని పేర్కొంది. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంటకు 7,65,022 విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. విత్తనాలతో అవసరమయ్యే ఎరువులను కూడా అంచనా వేసింది.


