నారాయణఖేడ్ / ఝరాసంగం(జహీరాబాద్): ఖేడ్ మండలం పంచగామలోని శనీశ్వరాలయానికి శనివారం శనిజయంతితోపాటు శనిఅమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శనీశ్వరుడి దర్శనానికి రెండు కి.మీల మేర బారులు తీరారు. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసి టెంకాయలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ పీఠాధిపతి కాశీనాథ్ మహారాజ్ బాబా ఆధ్వర్యంలో ఆలయంలో ధ్వజారోహణం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి అర్చన, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శని అమావాస్య పూజలు
జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రం బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ ఆవరణలో శని అమావాస్య పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని మంత్రి దామోదర రాజనర్సింహ, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఏడాకులపల్లి గ్రామంలో శనీశ్వరుడికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు హాజరై పూజలు చేశారు.


