గేటు కష్టాలు ముగిసేదెన్నడో? | - | Sakshi
Sakshi News home page

గేటు కష్టాలు ముగిసేదెన్నడో?

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

జహీరాబాద్‌: తరచూ రైల్వేగేట్ల మూసివేతతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకుగాను జహీరాబాద్‌ప్రాంతంలో ఎనిమిది వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదించినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. వంతెనలను నిర్మించేందుకు వీలుగా ఓ ప్రైవేటు సంస్థతో ప్రతిపాదించిన రైల్వేగేట్ల వద్ద ఏడాది క్రితం సాయిల్‌ టెస్టింగ్‌ పనులను నిర్వహించి శాంపిళ్లను సేకరించి నివేదికలను అందజేసింది. అయినా ఇప్పటివరకు నిధుల మంజూరు లేకపోవడంతో పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోంది.

రెండు ప్రాంతాల్లో ఫ్లైవర్‌బ్రిడ్జిలనే నిర్మించాలి

రద్దీగా ఉండే జహీరాబాద్‌–బీదర్‌, జహీరాబాద్‌–కోహీర్‌ ప్రాంతాల్లో ఉన్న రైల్వేగేట్ల వద్ద అండర్‌ బ్రిడ్జిలను నిర్మించాలా లేక ఫ్లై ఓవర్‌బ్రిడ్జిలను నిర్మించాలనే దానిపై రైల్వేశాఖ ఇంకా నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌–బీదర్‌ రహదారి ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. ఈ రహదారిని ఫోర్‌లైన్‌గా విస్తరించేందుకు మంజూరు లభించింది. దీంతో ఫ్లైవర్‌ బ్రిడ్జిని నిర్మించడమే సౌలభ్యంగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. 65వ జాతీయ రహదారి నుంచి కోహీర్‌ మున్సిపాలిటీ మీదుగా వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ వెళ్లే రహదారి ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. ఈ రహదారి రానున్న రోజుల్లో ఫోర్‌లైన్స్‌గా విస్తరించే అవకాశం ఉంది.

అండర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం..

కోహీర్‌–నాగిరెడ్డిపల్లి వెళ్లే రహదారిపై కోహీర్‌ వద్ద ఉన్న రైల్వే గేటును మూసివేసి అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదించారు. ఇదే రహదారిపై పైడిగుమ్మల్‌ వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేటు వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం గుర్తించారు. కోహీర్‌–పోతిరెడ్డిపల్లి రహదారిపై ఉన్న గేటు వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మించడమా లేక నాగిరెడ్డిపల్లి గేటు వద్ద నుంచి సర్వీస్‌ రోడ్డు నిర్మించి అనుసంధానం చేయడమా అనే విషయమై పరిశీలనలో ఉంది. జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లి–పిచరాగడి గేటు వద్ద, న్యాల్‌కల్‌ మండలంలోని మెటల్‌కుంట వద్ద, బసంత్‌పూర్‌ గేటు వద్ద అండర్‌ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రతిపాదించారు. రైలు వచ్చిన ప్రతిసారీ గేట్లను మూసివేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా గేట్లను మూసేవేస్తుండటంతో ట్రాఫిక్‌ సైతం స్తంభించిపోతోంది. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జిల నిర్మాణం పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కోహీర్‌ రైల్వే గేటువద్ద

డ్రిల్లర్‌తో సేకరిస్తున్న

మట్టి శాంపిల్‌ (ఫైల్‌)

కోహీర్‌లో బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉన్న రైల్వే గేటు

ఎనిమిది రైల్వే వంతెనల

నిర్మాణం ఎప్పుడో?

ప్రతిపాదించి ఏడాది పూర్తి

నిధుల మంజూరు

ప్రకటనలకే పరిమితం

Advertisement
 
Advertisement
Advertisement