సంగారెడ్డి జోన్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాను నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, గోవులు, ధాన్యం అక్రమ రవాణా నివారణ నియంత్రణ, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. పశువుల అక్రమ రవాణా నివారణ కోసం 9 చెక్పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని రాష్ట్రంలో విక్రయించకుండా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు పాల్గొన్నారు.


