బెజ్జంకి(సిద్దిపేట): వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని మూసి వేయాలని మండల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రైతు యుద్ధం – ప్రజారోగ్యం పేరుతో ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విషవాయువులు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారాయన్నారు. భూమి, పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మానకొండుర్ నియోజకవర్గ ఇన్చార్జి సురేశ్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఎంఆర్పీఎస్, స్వేరోస్, మాల మహనాడు నాయకులు పాల్గొన్నారు.


