అదనపు కలెక్టర్ సంగీత
వట్పల్లి(అందోల్): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని అదనపు కలెక్టర్ సంగీత స్పష్టం చేశారు. మండల పరిధిలోని కేరూర్, బిజిలీపూర్, ఖాదిరాబాద్ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె సందర్శించారు. ధాన్యం నిల్వలు, తేమ శాతం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం జరగకుండా ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం వట్పల్లిలోని సిద్ది వినాయక రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు? వాటిలో ఎన్ని అన్లోడ్ చేసుకున్నారు? ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట రాజేశ్, తహసీల్దారు జంగేశ్వర్తోపాటు తదితరులున్నారు.


