చిన్నకోడూరు(సిద్దిపేట): కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు కుమారులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి, రామవ్వ వృద్ధ దంపతులకు రాజిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. వృద్ధ దంపతులకు ఉన్న ఏడెకరాల భూమిని కూడా ఇద్దరు కుమారుల పేరున చేయించారు. వయస్సు మీద పడటంతో తమను పట్టించుకోవడం లేదని కుమారులను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ వారి గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు.


