మా భూములు మాకు ఇప్పించండి
పోతిరెడ్డిపల్లి చౌరస్తా అంబేడ్కర్కాలనీ భూ లబ్ధిదారుల వినతి పేదల భూములు కాజేసే కుట్రకుతెరదీసిన రియల్ వ్యాపారి సదరు వ్యాపారికే పోలీసుల వత్తాసు
సంగారెడ్డి: న్యాయానికి రక్షణగా నిలవాల్సిన పోలీసులే పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ అన్యాయానికి అండగా నిలుస్తున్నారని పోతిరెడ్డిపల్లి చౌరస్తా అంబేడ్కర్ కాలనీ వాసులు వాపోతున్నారు. తమ భూములు తమకు ఇప్పించండని భూమి లబ్ధిదారులు కలెక్టర్ను వేడుకుంటున్నా వారికి న్యాయం మాత్రం జరగడం లేదు.
ఇదీ గొడవ..
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సర్వేనంబర్ 153/4, 153/5, 153/25 విస్తీర్ణం 3–20 గల భూమిలో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పేదలకు భూములు పంపిణీ చేశారు. వాటికి పట్టా సర్టిఫికెట్లు కూడా జారీ చేసి వారికి పొజిషన్ కూడా చూపించారు. అయితే అక్కడ సరైన మౌలిక వసతులు లేని కారణంగా ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. ఇదే అదనుగా భావించి ఓ రియల్ వ్యాపారి హెచ్ఎండీఏ అనుమతులతో పేదలకు పంపిణీ చేసిన స్థలాలను కూడా ఆక్రమించుకుని వెంచర్ వేసేశాడు. ఇటీవల ఆ ప్రాంతం మెల్లగా అభివృద్ధి చెందుతుండటంతో సదరు భూముల లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు తమ తమ స్థలాల వద్దకు వెళ్లగా స్థానికులు, సదరు రియల్ వ్యాపారి కలసి వారిని అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. దీంతో లబ్ధిదారులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు భూ లబ్ధిదారులకు నచ్చజెప్పి పంపించేశారు. పోలీసులు కూడా సదరు రియల్ వ్యాపారికే వత్తాసు పలుకుతుండటంతో శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్య కలిసి ఫిర్యాదు చేశారు. శనివారం కలెక్టర్ స్థానిక ఆర్ఐను అక్కడకి పంపించగా...లబ్ధిదారుల వెంచర్ను వేరు చేసేందుకు జేసీబీని పిలిపించారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని లబ్ధిదారులు చెదరగొట్టారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ప్రజాసంఘాలు, ఉద్యమకారులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మా భూములు మాకు ఇప్పించండి


