డె యిరీకి మహ ర్దశ!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఇప్పటికే రెసిడెన్షియల్,వసతి గృహాలకు సరఫరా పాడి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విజయ పాలు
ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉదయం విజయ డెయిరీ పాలతో పాటు అల్పాహారం అందజేయాలని నిర్ణయించింది. దీంతో వేలాది మంది విద్యార్థులతో పాటు పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.
– మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు 904 ప్రభుత్వ బడులు ఉండగా, వాటిలో 72 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే 16 ఇంటర్మీడియెట్ కాలేజీల్లో 6,603 మంది విద్యార్థులున్నారు. ఈలెక్కన 1 నుంచి 12 తరగతుల వరకు మొత్తం 78,603 మంది చదువుకుంటున్నా రు. కాగా ఇప్పటికే 1 నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుండగా, తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12 తరగతుల వరకు నిత్యం ఉదయం అల్పాహారం, ఒక్కో విద్యార్థికి 150 మిల్లీ లీటర్ల పాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
నిత్యం 3,500 లీటర్లు సేకరణ
జిల్లాలో 21 మండలాలు ఉండగా, 17 మండలాల నుంచి మెదక్ విజయ డెయిరీ పాల కేంద్రానికి నిత్యం 3,500 లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, చేగుంట, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, రేగోడ్ మండల కేంద్రాల్లో విజయ డెయిరీకి సంబంధించిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఉండగా, ఆ ఆరు సెంటర్లకు 11 మండలాల నుంచి పాలు సేకరిస్తున్నారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని పాల కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. కాగా విజయ డెయిరీ రోజూ 1,500 లీటర్ల పాలను జిల్లాలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫర్, ఎంజేపీ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మిగితా 2 వేల లీటర్లను స్థానికంగా విక్రయిస్తున్నారు. మరికొన్ని లీటర్లను హైదరాబాద్కు తరలిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 12 తరగతుల వరకు సరఫరా చేస్తే పూర్తిస్థాయిలో పాలు అందించాల్సి ఉంటుంది.


