మహిళలకు రక్షణగా పోష్ చట్టం
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితకుమారి
జహీరాబాద్ టౌన్: పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణగా లైంగిక వేధింపుల నివారణ చట్టం పోష్ యాక్ట్ నిలుస్తుందని మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితకుమారి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న మహిళలకు యాక్టుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే పోష్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతీ కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడే సీ బాక్స్ పోర్టల్ గురించి వివరించారు. తహసీల్దార్ దశరథ్ మాట్లాడుతూ..మహిళల రక్షణ కోసం పలు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ సుశీల, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త పల్లవి, న్యాయవాది రుద్రయ్యస్వామి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


