ఇంటర్ పరీక్షలకు సిద్ధం
హాజరు కానున్న 35,986మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాలు
న్యాల్కల్(జహీరాబాద్): ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు వచ్చేలా సూచనలు చేశారు.
జిల్లాలో 25 నుంచి ఇంటర్ ఫస్టియర్, 26 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 25 నుంచి వచ్చే మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలో 148 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. అందులో 17,762 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 18,224 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 35,986 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
ప్రత్యేక బస్సులు
పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆయా రూట్లలో బస్సులు నడపాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


