నెల రోజులుగా పులి సంచారం
● బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
● అర్బన్ పార్క్ నిర్వహణపై దృష్టి పెట్టండి
● ఎమ్మెల్యే హరీశ్ రావు
● అటవీశాఖ అధికారులతో సమీక్ష
సిద్ధిపేటజోన్: జిల్లాలో నెల రోజులుగా పులి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని, ప్రజలను అప్రమత్తం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధికారి(డిఎఫ్ఓ)పద్మజ రాణి, ఎఫ్ఆర్ఓ విక్రమ్తో ఆయన ఇటీవల జిల్లాలో పులి సంచారం, నియోజకవర్గ పరిధిలోని అటవీశాఖ అర్బన్ పార్క్, మొక్కల పెంపకం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి 24న కామారెడ్డి నుంచి తొగుట, జగదేవ్పూర్, ధన్వంతరి మీదుగా యాదాద్రి, జనగామ, హుస్నాబాద్, అరెపల్లి, చిన్నకోడూర్, అల్లిపూర్, విఠలాపూర్ మీదుగా ప్రస్తుతం మిడ్ మానేరు వైపు వెళ్లిందని అధికారులు వివరించారు. ఇప్పటికే జిల్లా లో ఎనిమిది దూడలను పులి చంపిందని వాటికి సంబంధించి రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, అందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హరీశ్రావు అధికారులకు సూచించారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేసి వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండేలా చూడాలని సూచించారు.
అర్బన్ పార్క్ నిర్వహణ బాగుండాలి
సిద్దిపేట ప్రాంతంలో అద్భుతమైన ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేసుకున్నామని, నిర్వహణ బాగుండాలని హరీశ్ రావు సూచించారు. ప్రజలకు వాకింగ్, పర్యాటకులకు ఉపయోగపడేలా దాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. మెగా నర్సరీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మొక్కల పెంపకం గూర్చి ఆరా తీశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ తదితరులు పాల్గొన్నారు.


