
ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి జోన్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. గ్రామాలకు దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండే విధంగా చూడాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని సులభంగా అమ్ముకునే విధంగా తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. పంట సాగు పరిస్థితులు, దిగుబడులపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ రైస్ మిల్లును తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబాదాస్ రాజేశ్వర్, పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజ, డీఆర్డీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మహాసభలను
జయప్రదం చేయండి
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సెప్టెంబర్ 26,27,28వ తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించే యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ..విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేయనున్నామన్నారు. మూడోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తూ విద్యార్థుల్లో మేధావుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని మండిపడ్డారు. విద్యారంగం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, రవి తేజ, శేఖర్, సాత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధిక నేరాలు ఉంటే
గ్యాంగ్ కేసులు
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: నూతన చట్టం ప్రకారం గత పదేళ్లలో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కనీసం రెండు నేరాలు చేసి ఉంటే వారిపై గ్యాంగ్ కేసులను నమోదు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎక్కువ మంది వ్యక్తులు కలిసి గ్యాంగ్గా ఏర్పడి వివిధ రకాల ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో తిరిగి ఇలాంటి నేరాలు చేయకుండా నివారించడమే ఈ గ్యాంగ్ కేసుల ముఖ్యఉద్దేశమన్నారు. గ్యాంగ్ కేసులకు నాన్ బెయిలబుల్తోపాటు ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశముందని తెలిపారు.
మున్సిపల్ కార్మికులను
విస్మరిస్తున్న ప్రభుత్వం
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
పటాన్చెరు టౌన్: మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ వారిని పూర్తిగా విస్మరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆరోపించారు. పటాన్చెరు పట్టణంలోని అంబేడ్కర్భవన్లో శనివారం జరిగిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ జిల్లా మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు పని గంటలు తగ్గించకపోవడం వల్ల పని భారం పడుతుందన్నారు. ఒకవైపు పని భారం పడుతున్నా వేతనాలను పెంచడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ ఇతర చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, కోశాధికారి కె.రాజయ్య, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు