
పుస్తెలతాడు అపహరణ
కొమురవెల్లి(సిద్దిపేట): మహిళ మెడలో పుస్తెల తాడు అపరించుకెళ్లిన ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో మంగళవారం చోటు చేసుకుంది. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన వనపర్తి భాగమ్మ ఆలయ పరిసరాల్లో కిరాణం, జనరల్ స్టోర్ను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. రోజూ మాదిరిగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వామి వారిని దర్శించుకొని వచ్చి షాప్ను ఓపెన్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలోంచి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
తొగుట(దుబ్బాక): దీపంతో ఇల్లుకు నిప్పంటుకొని కాలిబూడిదైన ఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాయిని ఎల్లవ్వ ఉదయం ఇంట్లో దేవుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లింది. ఈ ప్రమాదవశాత్తు దీపం కిందపడి బట్టలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై సిద్దిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలార్పివేశారు. ఈ ఘటనలో రూ.3 వేలు నగదు, బట్టలు, బియ్యం, వంట సామగ్రితోపాటు కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు చేయించుకున్న దర్వాజ లు, కిటికీలు కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
వర్గల్(గజ్వేల్): కడుపునొప్పి భరించలేక తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం అంబర్పేటలో చోటు చేసుకుంది. గౌరారం పోలీసుల కథనం మేరకు.. అంబర్పేటకు చెందిన మన్నె శ్రీనివాస్, రేణుక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి ఏడాదిన్నర కిందట వివాహం కాగా చిన్న కూతురు జ్యోతి(17) మెదక్ జిల్లా కూచారం కస్తూర్బా గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇటీవలె ఫస్టియర్లో 439 మార్కులు సాధించింది. సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటుంది. కొంత కాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న జ్యోతి మంగళవారం సాయంత్రం నొప్పి తాళలేక గ్రామ సమీప తోటలో మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి మందలించాడని యువకుడు
మద్దూరు(హుస్నాబాద్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బచ్చల చంద్రకాంత్(24) కొద్ది రోజులుగా ఏ పని చేయకుడా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బలరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్(20) మంగళవారం మధ్యాహ్నం ఇంటి పరిసరాల్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు
మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మండలంలోని దారకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య, ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఓంకార్ రాధాకృష్ణ గురువారం ఎంపికయ్యారని మండల విధ్యాధికారి వెకట్రాములు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో 641 మంది దరఖాస్తు చేసుకోగా 27న రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు హైదరాబాద్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. 152 మంది ఎంపికయ్యారని మర్కూక్ మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారని తెలిపారు. పాఠశాలల ఉపాధ్యాయుల వారికి అభినందనలు తెలిపారు.

పుస్తెలతాడు అపహరణ

పుస్తెలతాడు అపహరణ