ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధన, సుస్థిర వ్యవసాయం, యాంత్రీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశుసంవర్థక శాఖలు, ఆయా కంపెనీల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై సమాచారం అందిస్తామన్నారు. రైతులు– శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
సాగుపై అవగాహన అవసరం
కేశంపేట: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, డీలర్లకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరుతడి పంటల సాగుతో పాటు పశుపోషణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సన్నవడ్లకు బోనస్ లభించాలంటే ధాన్యం కొనుగోలు చేసిన షాపులోనే రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. బోనస్కు సంబంధించి డీలర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు వినయ్, తేజ్కుమార్, ప్రశాంత్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


